యోగా గురువు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రముఖ ఆయుర్వేద, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల సంస్థ పతంజలి త్వరలో మరో రెండు కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశించబోతున్నది. ఈ ఏడాదిలో సంస్థ డెయిరీ (పాల), అప్పారెల్ (రెడీమేడ్ దుస్తులు) విభాగాల్లోకి ప్రవేశించబోతున్నట్లు తెలుస్తున్నది. దాంతో పతంజలి గ్రూపు మొత్తం 11 వ్యాపార విభాగాల్లోకి ప్రవేశించినట్లవుతుందని బాబా రాందేవ్ తెలిపారు. దేశీయ డెయిరీ ఇండస్ట్రీ మార్కెట్ సైజు 7,000 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) చేరుకుంది. ఇండియాలో బ్రాండెడ్ అప్పారెల్ ఇండస్ట్రీ సైజు రూ.16 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. మొత్తం రూ.20 లక్షల కోట్ల విలువ చేసే ఈ రెండు విభాగాల్లోనూ పతంజలి తనదైన హవా కొనసాగించాలనుకుంటున్నది. ఇప్పటికే సంస్థ ఎఫ్ఎంసీజీ రంగంలో హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు గట్టిపోటీనిస్తున్నది. జూలైలో పతంజలి సంస్థ రూ.40 వేల కోట్ల మార్కెట్ సైజుకు చేరుకున్న ప్రైవేట్ సెక్యూరిటీ సేవల విభాగంలోకి ప్రవేశించింది. దివ్య జల్ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ను విడుదల చేయనున్నట్లు సంస్థ ఈమధ్యే ప్రకటించింది. ఇవేకాదు, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ, సబ్వే వంటి మల్టీనేషనల్ ఫాస్ట్ఫుడ్ విక్రయ కేంద్రాల నిర్వహణ సంస్థలకు పోటీగా దేశంలో గొలుసుకట్టు స్వదేశీ రెస్టారెంట్లు ప్రారంభించే ఆలోచన కూడా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.10,561 కోట్ల టర్నోవర్ సాధించిన పతంజలి.. ఈసారి విలువను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.