జపాన్ ప్రధాని షింజో అబె రెండు రోజుల గుజరాత్ పర్యటన కోసం అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో సతీమణితో కలిసి వచ్చిన అబెకు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. విమానం దిగగానే అబెను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు మోదీ. అక్కడి నుంచి నేరుగా రోడ్ షో నిర్వహించి గాంధీ సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు ఇద్దరు నేతలు. 9 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వేల మంది అబెకు స్వాగతం పలికారు. డప్పులు, నృత్యాలతో సాంప్రదాయ రీతిలో ఇరు దేశాల ప్రధానులను గ్రీట్ చేశారు. సబర్మతి ఆశ్రమంలో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ఆశ్రమ విశేషాలను మోదీ.. అబెకు వివరించారు. విమానం దిగే సమయంలో సూట్ వేసుకొని కనిపించిన అబె.. ఓపెన్ టాప్ జీపులో మాత్రం భారత సాంప్రదాయ కుర్తాలో కనిపించడం విశేషం. అబె ఇండియాకు రావడం ఇది నాలుగోసారి. మోదీ ఇవాళ రాత్రి అబెకు ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు. తన ఫేవరెట్ వంటకాలతో జపాన్ ప్రధానికి విందు ఇవ్వనున్నారు. రేపు షింజో అబె ఇండియా తొలి బుల్లెట్ రైలుకు శంకుస్థాపన చేయనున్నారు. జపాన్ సాయంతో రానున్న ఈ బుల్లెట్ రైలు ముంబై, అహ్మదాబాద్ మధ్య పరుగులు తీయనుంది.