అనుమానంతో ఓ భర్త తన భార్యను కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా డోన్ మండలంలో మంగళవారం జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డోన్ కొత్తపేట ప్రాంతానికి చెందిన బాలలక్ష్మీదేవి(30)కి, వెల్దుర్తి మండలం గువ్వలకుంట్లకు చెందిన బంగి సుధాకర్ కు ఏడాది కిందట వివాహమైంది. ఆమె డోన్ మండలం వెంకటనాయునిపల్లె గ్రామసచివాలయంలో మహిళా పోలీసుగా పని చేస్తున్నారు. సుధాకర్ నంద్యాలలో వార్డు సచివాలయ సంక్షేమ సహాయకుడిగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా భార్యపై అనుమానం పెట్టుకున్న సుధాకర్ ఆమెను వేధించేవాడు. ఆమె డోన్ పోలీసుస్టేషన్లో కొన్ని నెలల క్రితం అతడిపై ఫిర్యాదు చేసింది. దీంతో సుధాకర్ ఆమెపై గతంలో రెండుసార్లు దాడికి యత్నించాడు. వారు విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం ఆమె విధులు ముగించుకుని బైక్ పై మరో ఉద్యోగితో కలసి డోన్కు వస్తున్న సమయంలో సుధాకర్ దారికాచి ఆమెపై కత్తితో దాడి చేశాడు. గొంతుకోసి పరారయ్యాడు. లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.