కర్నూలు: నేటి విద్యార్థులే రేపటి పౌరులు అలాంటి విద్యార్థులకే విద్య అందని ద్రాక్షల మారింది. చదవాలని సంకల్పం ఉన్న పాఠశాలకు వెళ్లేందుకు సరైన సౌకర్యం లేకపోవడంతో ప్రతి రోజు వాగును దాటుకుంటూ చదువును కొనసాగిస్తున్నారు. డిజిటల్ ఇండియా వైపు పరుగులు పెడుతున్న నేటి తరుణంలో ఇలాంటి పరిస్థితులు ఇంకా ఎక్కడో ఓ చోట ఉంటూనే ఉన్నాయి.
అక్కడ విద్యార్థులు చదువుకోవాలంటే వారి ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే. కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలోని హంద్రీ నదిపై వంతెన లేకపోవడంతో విద్యార్థులు ప్రమాదకరంగా ఉన్న నీటి ప్రవాహాన్ని దాటుకుంటు వచ్చి విద్యాను అభ్యసించాలి.
తల్లిదండ్రులు కలలు కన్న ఉజ్వల భవిష్యత్తు కోసం.. నిరంతరం రెండు మండలాలకు (క్రిష్ణగిరి, కోడుమూరు మండలంలోని కొత్తపల్లె) చెందిన విద్యార్థులు ఆ ఉధృతంగా ప్రవహిస్తున్న హంద్రీనదిని దాటుకుంటు వచ్చి గోరంట్ల గ్రామంలో విద్యాను పొందుతున్నారు. భారీగా వర్షాలు కురిసిన, దామోదరం సంజీవయ్య (గాజులదిన్నె) ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే ప్రతిసారి విద్యార్థులకు ఈ తిప్పలు తప్పడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులు వారిని పాఠశాలకు పంపించాలంటే భయాందోళనకు గురవుతున్నారు.
హంద్రీ నదిలో విద్యార్థుల నిత్య సాహసోపేత పోరాటాలు చూడలేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధికారంలోకి రాక ముందు చేసిన పాదయాత్ర సమయంలో కోడుమూరు మండలంలోకి ప్రవేశించినప్పుడు స్వయంగా ఈ దుస్థితిని చూసి ఆధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపు ఈ హంద్రీ నదిపై వంతెన నిర్మాణం చేపడుతామని ప్రజలకు హామీ ఇచ్చారు.
సీఎంగా గెలిచి నేటికి మూడు సంవత్సరాలు కావస్తున్న ఆ హామీ మాత్రం నీటి పై రాతలుగానే మిగిలిపోయింది. కోడుమూరు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్, జిల్లా ఆధికారులు ఈ వంతెన నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించి, ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. కానీ ఈ వంతెన నిర్మాణం ఎప్పుడు జరుగుతుందో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.