చెన్నై: సూపర్స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ హైకోర్టులో దావా వేశారు. రజనీ సతీమణి లతా రజనీకాంత్ నేతృత్వంలో ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ పాఠశాల నడుస్తోన్న సంగతి తెలిసిందే. గిండీలోని పాఠశాలను కొన్ని రోజుల క్రితం మూసివేశారు. బ్రాంచ్లోని దాదాపు 300 మంది విద్యార్థుల్ని వెలచెరీ బ్రాంచ్కు తరలించారు. భవనానికి అద్దె చెల్లించకపోవడంతోనే పాఠశాలను మూసివేశారంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే అద్దె చెల్లించని కారణంగా పాఠశాల మూసివేయలేదంటూ అదే రోజున లతా రజనీకాంత్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
ఆశ్రమ్ పాఠశాలను నడుపుతున్న శ్రీరాఘవేంద్ర ఎడ్యుకేషనల్ సొసైటీకి కార్యదర్శిగా పనిచేస్తున్న ఐశ్వర్య ధనుష్ భవనం యజమానిపై దావా వేశారు. నష్టపరిహారంగా రూ.5 కోట్లు, అద్దె చెల్లించలేదంటూ తప్పుడు ఆరోపణలు చేయడంతో రాఘవేంద్ర ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు దెబ్బతిన్నందుకు రూ.1 కోటి చెల్లించాలని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె మద్రాస్ హైకోర్టులో దావా వేశారు.