గుంటూరు : భారతదేశాన్ని ప్రధాని మోదీ అవినీతిరహితంగా తీర్చిదిద్దుతున్నారని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ అమెరికా, చైనాలకు ధీటుగా భారత్ ఎదుగుతోందని, ప్రపంచమంతా భారత్నే చూస్తోందన్నారు. 45 ఏళ్లుగా నలుగుతున్న బంగ్లాదేశ్ సరిహద్దు సమస్యను మోదీ పరిష్కరించారని, ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 86 లక్షల హెక్టార్లలో సాగునీటి కల్పన లక్ష్యంగా ప్రధాని ముందుకు సాగుతున్నారన్నారు. పసల్ బీమా యోజన నిబంధనలను సడలిస్తున్నట్లుగా జేపీ నడ్డా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కిడ్నీ బాధితులకు ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తున్నట్లుగా కేంద్రమంత్రి జేపీ నడ్డా తెలిపారు. దేశంలో 100 జిల్లాల్లో 30 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా యూనివర్సెల్ హెల్త్ స్క్రీనిం గ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2022 నాటికి మోదీ కొత్త భారతావనిని రూపొందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలోఏపీ ప్రభుత్వం బాగా పని చేస్తోందంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా ప్రశంసించారు. అమరావతి పరిధిలోని తాడికొండలో రూ.4 కోట్లతో నిర్మించిన రూరల్ హెల్త్ సెంటర్ ను, విద్యార్థుల అదనపు వసతి గృహాలను ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నడ్డా మాట్లాడుతూ, హెల్త్ సెంటర్ ను, విద్యార్థుల వసతి గృహాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఎయిమ్స్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, వచ్చే ఏడాదిలో ఎయిమ్స్ తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఫాతిమా మెడికల్ కళాశాల వివాదంపై నడ్డాకు మరోమారు వివరించామని, కోర్టు నిర్ణయం మేరకు నడుచుకుంటామని చెప్పారు. గేట్ ప్రవేశపరీక్షలో ఏపీ విద్యార్థులకు సంబంధించి ఆర్టికల్ 371-డిలో ఉన్న ఇబ్బందులపై ముఖ్యమంత్రి కూడా మంత్రికి వివరించామని చెప్పారు.