ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పళనిస్వామిపై అవిశ్వాస తీర్మానం పెట్టండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2017, 12:40 PM

చెన్నై : తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. శశికళ వర్గం సీఎం పళనిస్వామికి మద్దతు ఉపసంహరించుకుంది. ఆ రాష్ర్ట గవర్నర్ విద్యాసాగర్ రావును రాజ్ భవన్ లో శశికళ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు కలిసి సీఎం పళనికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు శాసనసభలో సీఎం పళనికి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేదన్నారు. పళనిపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అని గవర్నర్ కు వినతి చేశామని తెలిపారు. కాసేపటికే ఎంపీ మైత్రేయన్ గవర్నర్ ను కలిసి పళనిస్వామికి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 234. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 134 మంది. వీరిలో 19 మంది ఎమ్మెల్యేలు శశికళ వర్గానికి చెందిన వారున్నారు. ఈ 19 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి మద్దతు ఉపసంహరించుకోవడంతో115 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే సీఎంకు ఉంటుంది. సీఎం పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకోవాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పళనికి మద్దతు ఇవ్వాలి. లేకపోతే పళని ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడులో పాలక అన్నాడీఎంకే ప్రత్యర్థి వర్గాలు నిన్న ఒక్కటైన విషయం విదితమే. దీంతో ఆరునెలల రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చేతులు కలిపారు. గతంలో ఆపద్ధర్మంగా సీఎం పదవి చేపట్టిన పన్నీర్ ఇప్పుడు విలీనం ఒప్పందంలో భాగంగా డిప్యూటీ సీఎం అవతారం ఎత్తారు. మేమంతా అమ్మ బిడ్డలం అన్నదమ్ములం అంటూ సీఎం పళని ఐక్యతారాగం ఆలపించారు. మరోవైపు అక్రమాస్తుల కేసుతో జైలుపాలైన శశికళను పార్టీ అధినేత్రి పదవి నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com