చెన్నై: తమిళనాడులో ఆరు నెలలపాటు సాగిన హైడ్రామాకు తెరపడింది. అన్నాడీఎంకే పార్టీలో చీలిక వర్గాలు ఒక్కటయ్యాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం ఏకమయ్యారు. జయలలిత మృతి అనంతరం ఆ పార్టీలో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఆ పార్టీని నిట్టనిలువునా చీల్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లాక.. ఇరు వర్గాల మధ్య అనేక సంప్రదింపులు, చర్చోపచర్చల నేపథ్యంలో ఎట్టకేలకు ఏకాభిప్రాయం కుదిరింది. గత కొన్ని రోజులుగా తమిళనాట రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న ఈ విలీనం వ్యవహారానికి ఈ రోజు పన్నీర్ సెల్వం ప్రకటనతో తెరపడింది.
జయలలిత మృతిపై న్యాయవిచారణ జరిపేందుకు ఇప్పటికే కమిటీ వేసిన నేపథ్యంలో ఇరు వర్గాల విలీన ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. పన్నీర్ డిమాండ్ మేరకు శశికళను పార్టీ నుంచి తొలగించనున్నారు. త్వరలోనే పార్టీ సమావేశం ఏర్పాటుచేసి ప్రస్తుతం పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళను ఆ పదవి నుంచి తప్పిస్తామని అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు శశికళకు మద్దతు ఇస్తున్న కొందరు ఎమ్మెల్యేలు ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్తో సమావేశమై తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు.