దంబుల్లా: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత ఆటగాడు శిఖర్ధావన్ 90 బంతుల్లో 132 పరుగులతో నాటౌట్గా నిలిచిన సంగతి తెలిసిందే. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శిఖర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇటీవల వరుస ఇన్నింగ్స్లతో రాణిస్తోన్న అతను.. గతంలో జట్టులో స్థానం కోల్పోయిన సమయంలో.. ఓటముల నుంచి ఎంతో నేర్చుకున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఓటములే మనకు భవిష్యత్తులో రాణించేందుకు ముఖ్యమైన పాఠాలు నేర్పుతాయని తెలిపాడు.
తొలి వన్డే అనంతరం శిఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘గత ఏడాది న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో నేను మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. దీంతో జట్టులో నుంచి స్థానం కోల్పోవల్సి వచ్చింది. కాస్త విరామం తర్వాత ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో జట్టులో స్థానం దక్కించుకోగలిగాను. ఈ టోర్నీలో నా ప్రదర్శనకు మంచి మార్కులే పడ్డాయి. భవిష్యత్తులోనూ ఇదే ప్రదర్శననే కొనసాగించాలి అనుకుంటున్నాను. 2019లో ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ఇంకా ఎంతో సమయం ఉంది. ఈ టోర్నీలో మంచి ప్రదర్శన చేయాలన్నది నా లక్ష్యం. అందుకే ఇదంతా. ఒకవేళ నేను మంచి ప్రదర్శన చేయలేకపోతే నా స్థానంలో మరో బ్యాట్స్మెన్ చోటు దక్కించుకోవడం ఖాయం’ అని అన్నాడు. ‘ఓటములు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఇప్పటికే వాటి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం కోల్పోయిన సమయం నాకెంతో కఠినమైనది. ఇప్పుడు దాని నుంచి బయటికి వచ్చేశాను కాబట్టి మరోసారి ఆలోచించాలని అనుకోవట్లేదు. 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్పై శతకం సాధించాను. అప్పుడు ఏ ఫామ్లో ఆడానో ఇప్పుడు అదే ఫామ్లో ఆడుతున్నా. మ్యాచ్కి ముందు లక్ష్యాలను ఏర్పరుచుకోను. కేవలం ఫిట్నెస్, ఫీల్డింగ్, స్కిల్స్పైనే ‘ఎక్కువగా దృష్టిపెడతా అని తెలిపాడు.
శ్రీలంక ఇన్నింగ్స్ ఆరంభాన్ని చూసి ఆ జట్టు 300కి పైగా పరుగులు సాధిస్తుందని భావించా, కానీ స్వల్ప విరామంలో వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. మరిన్ని మ్యాచ్ల ద్వారా వారు త్వరలోనే అనుభవం సాధిస్తారు. విశ్వ ఫెర్నాండో బౌలింగ్ ప్రదర్శనపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను. అతనో మంచి బౌలర్. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతన్ని ఎదుర్కొన్నాను’ అని ధావన్ వివరించాడు.