చెన్నై: అన్నాడీఎంకే వర్గాల విలీనం విషయంలో చర్చలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, అందరూ ఎదురుచూసే విధంగా అనుకూలమైన ఫలితమే వస్తుందని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరో ఒకటి, రెండు రోజుల్లో అన్నాడీఎంకే వర్గాల విలీనం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘ఇరు వర్గాల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. మేమంతా ఎంజీఆర్, అమ్మ అడుగుజాడల్లోనే పయనిస్తాం’ అని పన్నీర్సెల్వం తెలిపారు. మథురైలోని తన వర్గీయులతో ఆదివారం చర్చలు జరపనున్నారు.
ఓపీఎస్(పన్నీర్సెల్వం), ఈపీఎస్(పళనిస్వామి) వర్గాలు వేర్వేరుగా చర్చలు జరిపి విలీనం విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం విలీనానికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని అందరూ అనుకున్నప్పటికీ ఓపీఎస్ సభ్యుల కారణంగా అది వాయిదా పడింది. అన్నాడీఎంకే వర్గాల విలీనం విషయంలో గత కొన్ని రోజులుగా వాడివేడీ చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే అమ్మ జయలలిత మృతిపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయించడంతో పాటు, వేద నిలయాన్ని స్మారక మందిరంగా చేస్తున్నట్లు సీఎం పళనిస్వామి రెండు రోజుల క్రితం ప్రకటించడంతో విలీనం అడుగులు దగ్గర పడుతున్న సంకేతాలు కనిపించాయి.