బార్సిలోనా: స్పెయిన్లోని బార్సిలోనాలో ఉగ్రదాడి వంటిదే కామ్బ్రిల్స్లోనూ పునరావృతం చేయాలన్న ముష్కరుల యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ దాడుల సూత్రధారులను పట్టుకొనేందుకు ఆ దేశ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అత్యంత సమన్వయంతో దాడులు నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పోర్ట్ఆఫ్ కామ్బ్రిల్స్లో రెండో ఉగ్రదాడిని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. కొందరు వ్యక్తులు ఒక వ్యానును విచక్షణా రహితంగా ప్రజలపైకి తీసుకెళ్లారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. బార్సిలోనా ఘటనను పునరావృతం చేయటమే లక్ష్యంగా ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. వారిని ఆగిపోవాలని పోలీసులు హెచ్చరించిన ఫలితం లేదు. దీంతో భద్రతా దళాలు వారిని కాల్చి చంపాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. నిన్న ఉగ్రదాడి జరిగిన బార్సిలోనాకు దక్షిణాన 130 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.