ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నంద్యాల ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ జగన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 17, 2017, 04:41 PM

నంద్యాల: మూడున్నరేళ్ల పాలనలో సీఎం చంద్రబాబు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శించారు. తొమ్మిదో రోజు నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మంచినీళ్ల బావి దగ్గర హరిజనపేటలో ప్రజలను ఉద్దేశించి జగన్‌ మాట్లాడారు. అన్ని వర్గాలను చంద్రబాబు వంచించారని, ఆయన పాలన దారుణంగా ఉందని ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నికలు రావడంతో మళ్లీ ఆయనకు ప్రజలు గుర్తుకు వచ్చారని, టేప్‌ రికార్డర్‌ ఆన్‌ చేశారని అన్నారు. ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని, దానికి నంద్యాల నాంది కావాలని జగన్‌ ఆకాంక్షించారు. ఆలోచించి ఓటు వేయాలని నంద్యాల ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి కావడానికి ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారు. రైతులకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని మాట తప్పారు. రైతులనే కాదు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను వదిలిపెట్టలేదు.


రూ.14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని హామీయిచ్చి మోసం చేశారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. నిరుద్యోగులకు 2 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం చూస్తే ప్రతి ఇంటికి రూ. 76 వేలు బాకీ ఉన్నారు. బెల్టు షాపులు తొలగిస్తానని చెప్పి, ఊరూరా వాటి సంఖ్యను పెంచారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి వాగ్దానాన్ని వెన్నుపోటు పొడిచిన సంగతి అందరికీ తెలుసు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలను నిర్వీర్యం చేశారు. నంద్యాలలో గతంలో 21,800 పెన్షన్లు ఉంటే బాబు పాలనలో 15 వేలకు తగ్గిపోయాయి. రేషన్‌ దుకాణాల్లో ఇప్పుడు బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు. గతంలో రేషన్‌ షాపుల్లో 9 రకాల సరుకులు ఇచ్చేవారు. దివంగత నేత ప్రియతమ నేత వైఎస్సార్‌ ఎవరూ చెయ్యనివిధంగా ప్రతి పేదవాడికి ఫీజు రీయింబర్స్‌ ఇచ్చారు. ప్రత్యేక హోదా హామీని చంద్రబాబు తుంగలో తొక్కారు. ముఖ్యమంత్రి హోదాలోనూ ఆయన ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయారు. నంద్యాల ఉప ఎన్నిక వచ్చేసరికి చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వచ్చారు. పాత టేప్ రికార్డర్‌ ఆన్‌ చేస్తారు, చెవుల్లో కాలిఫ్లవర్లు పెట్టడానికి ప్రయత్నిస్తారు. రాజకీయ వ్యవస్థ మారాలి, దీనికి నంద్యాల నాంది కావాలి. రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే కాలర్‌ పట్టుకుని అడిగే రోజు రావాలి. అప్పుడే వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది. మాట తప్పడం చంద్రబాబు నైజం. నాయకుడు అనే వాడికి విశ్వసనీయత చాలా ముఖ్యం. చంద్రబాబు మాదిరిగా మాట తప్పే నేతలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి. తన అవినీతితో చంద్రబాబు రూ.3.50 లక్షల కోట్లు సంపాదించారు. ఇప్పుడు ప్రతి ఓటరుకు రూ.5 వేలు ఇచ్చి దేవుడిపై ప్రమాణం చేయించుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో దేవుడిని స్మరించుకుని లౌక్యంగా ఓటు వేయండి. మీరు వేసే ప్రతి ఓటు చంద్రబాబు దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా వేసే ఓటుగా గుర్తించండి. ధర్మానికి ఓటు వేయండి, న్యాయాన్ని గెలిపించండి.




 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com