అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యి.. తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న సంకేతాలను ఇచ్చిన గంగుల ప్రతాపరెడ్డికి తమ పార్టీకి సంబంధం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆయన ఎప్పుడూ తమ పార్టీలో చేరలేదు, తమ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు.. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం తమకు సంబంధం లేని వ్యవహారం అని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ప్రకటించారు. గంగుల ప్రతాప రెడ్డి ఏ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి చేరుతున్నారో తమకు తెలియదని పేర్కొన్నారు.
గంగుల ప్రతాప రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి.. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టుగా మీడియాలో ప్రచారం జరుగుతోందని.. కానీ ప్రతాపరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది లేదని గుర్తుంచుకోవాలని విజయసాయి రెడ్డి సూచించారు. ఆయన తమ పార్టీ సభ్యుడు కానందున.. ఆయన వైఎస్సార్సీపీని వీడటం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు.
ఇక.. నంద్యాల ఉప ఎన్నికల వేడి నేపథ్యంలో ఈ విధంగా కండువాలు మారుతూనే ఉన్నాయి. కాస్తంత బలం ఉన్న నేతలనే కాదు, ఎవరు వచ్చినా కండువాలే వేసేసి.. పార్టీల అధినేతలే హడావుడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కప్పలతక్కెడలా అటూఇటూ జంపింగులు సాగుతున్నాయి. ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో సహా మరో ఐదు రోజుల సమయం ఉంది. దీంతో పార్టీలు తీవ్రంగా శ్రమిస్తూ.. ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి