ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు లేఖ రాశారు. అర్చకుల వేతనాలను రూ. 10వేల నుంచి రూ. 5వేలకు తగ్గించడం సరికాదని లేఖలో ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రూ. 250 కోట్లతో ఫండ్ ఏర్పాటయిందని... ఇతర ఆలయాల కంట్రిబ్యూషన్ కలిపితే రూ. 500 కోట్ల ఫండ్ ఉందని... ఆ నిధులతో అర్చకులకు రూ. 10వేల జీతం ఇవ్వవచ్చని సూచించారు. అర్చకుల జీతాల్లో కోత విధించడం సరికాదని అన్నారు. చినజీయర్ లాంటి ట్రస్టులు కూడా అర్చకులకు నెలకు రూ. 20వేల వేతనాన్ని ఇస్తున్నాయని చెప్పారు. ఆదాయం లేని ఆలయాల్లో పని చేసే అర్చకులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఐవైఆర్ ఈ లేఖ రాశారు.