అమరావతి: యువశక్తి, మానవ వనరులను సమృద్ధిగా వినియోగించుకుంటే భారత్ అగ్రదేశంగా మారుతుందని ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తొందని.. ప్రభుత్వాలు సంక్షేమ ఫలాలను అందరికీ అందించాలని సూచించారు. అమరావతిలోని అసెంబ్లీ భవనంలో నిర్వహించిన దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు కీలకపాత్ర పోషిస్తున్నారని.. వచ్చే ఏడాదికి రాష్ట్రం అభివృద్ధి పరంగా మరింత ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు అమరావతిలో శాశ్వత అసెంబ్లీ భవనాల డిజైన్లు ఖరారయ్యాయని... త్వరలోనే నిర్మాణ పనులు చేపడతామని స్పీకర్ వెల్లడించారు.