కరెన్సీ నోట్ల నాణ్యత నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. కొత్తగా వచ్చిన రూ.500, రూ.2000 నోట్లు వేర్వేరు పరిమాణాలు,డిజైన్లలో ఉన్నాయంటూ ఇటీవల పార్లమెంట్లో కాంగ్రెస్ ఆరోపించిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ వివరణ ఇచ్చింది. అంతర్జాతీయంగా అమలులో ఉన్న అత్యుత్తమ విధానాలను నోట్ల తయారీలో అమలు చేస్తున్నట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. నోట్ల పరిమాణం, డిజైన్, ముద్రణా విధానం ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూస్తున్నట్లు తెలిపింది. అధునాతన యంత్రాలు, నిపుణులైన సిబ్బంది ద్వారా నోట్ల ముద్రణ జరుపుతున్నందున నాణ్యత విషయంలో ఎలాంటి తేడా రాదని స్పష్టం చేసింది. నోట్ల నాణ్యతపై ఫిర్యాదులు రావడం చాలా అరుదని తెలిపింది.