హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ను మార్చి 13న ఆర్థికమంత్రి సభలో ప్రవేశపెడతారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో శాఖాధిపతులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మార్చి 6 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ‘‘విద్యుత్ కొరతను అధిగమించాం. వేసవిలో కూడా విద్యుత్ కొరత లేకుండా చేసుకున్నాం. ఉపకార వేతనాల అందజేతలో సాంకేతిక విధానాలు అనుసరించాం. ఆధార్ అనుసంధానం వల్ల లెక్కల్లో కచ్చితత్వం, పారదర్శకత వచ్చింది. ఎన్నికల హామీకి కట్టుబడి రైతు రుణాల ఉపశమనం కల్పించాం. ఈ సారి వర్షపాతం తక్కువగా ఉంది. రిజర్వాయర్లలో నీళ్లులేవు. పట్టిసీమ పూర్తి చేయడం వల్ల కృష్ణాడెల్టాకు నీళ్లివ్వగలిగాం, ఇది రాయలసీమకు కలిసొచ్చింది. రెండేళ్లలో ఆదాయం పెంచుకోగలిగాం.’’ అని వివరించారు.