న్యూఢిల్లీ: ఇక నుంచి తాను రాజకీయాల గురించి మాట్లాడను అని, ఇప్పుడు తాను అందరి మనిషిని, సభను సజావుగా నడిపేందుకు ప్రయత్నిస్తానని, ప్రతి ఒక్కరికీ మాట్లాడే అవకాశం ఉంటుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. ఇవాళ ఆయనకు సభ్యులు స్వాగతం పలికిన తర్వాత ఆయన మాట్లాడారు. మనం కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే అని, కానీ శత్రువులం కాదన్నారు. ప్రతి అంశంపైన కూడా ప్రతిపక్షం తమ అభిప్రాయాలను చెప్పవచ్చన్నారు. ఇచ్చి, పుచ్చుకునే స్వభావం ఇరు వైపులా ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది, ప్రతిపక్షం వ్యతిరేకిస్తుంది, సభ కొట్టిపారేస్తుందని తనదైన శైలి చమత్కారం వ్యక్తం చేశారు వెంకయ్య. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభలో ఉత్తమ సమయాన్ని గడిపామని, అప్పుడు నిర్మాణాత్మక చర్చలు చేపట్టేవాళ్లమన్నారు. సభలో జరుగుతున్న చర్చలను మీడియా రిపోర్ట్ చేయాలని సూచించారు.