పాట్నా : బీహార్ రాష్ర్టంలోని బక్సర్ జిల్లాలో విషాదం నెలకొంది. బక్సర్ జిల్లా కలెక్టర్ ముఖేశ్ పాండే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఘజియాబాద్ రైల్వే స్టేషన్ కు సమీపంలో వేగంగా వస్తున్న రైలుకు అడ్డంగా నిల్చుని.. కలెక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు.. పాండే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. 2012 బ్యాచ్ కు చెందిన ముఖేశ్ పాండే.. ఈ ఏడాది ఆగస్టు 4న బక్సర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. పాండే మృతి పట్ల బీహార్ సీఎం నితీష్ కుమార్ సంతాపం తెలిపారు. పాండే సమర్థవంతమైన అధికారి అని నితీష్ కొనియాడారు. అయితే ఆత్మహత్యకు ముందు తన ఫ్రెండ్స్ తో ముఖేశ్ పాండే మాట్లాడాడు. ఢిల్లీలోని జానకీపురిలోని ఓ షాపింగ్ మాల్ పైనుంచి దూకుతున్నట్లు చెప్పాడు. వాళ్లు వద్దని పాండేను వారించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు షాపింగ్ మాల్ సిబ్బందిని అలర్ట్ చేశారు. ఈలోపు కలెక్టర్ తన నిర్ణయాన్ని మార్చుకుని ఘజియాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
సూసైడ్ నోట్ సారాంశం.. నేను ముఖేశ్ పాండే. 2012 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. బీహార్ క్యాడర్ కు చెందిన నేను ప్రస్తుతం బక్సర్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాను. మనిషి అనేవాడికి ఈ భూమిపై మనుగడ లేదు. బతకాలనే కోరిక చచ్చిపోయింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా చావు గురించి మా కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయండి. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ లోని 742 గదిలో పూర్తి స్థాయి సూసైడ్ నోట్ లేఖ ఉందని కలెక్టర్ రాసి ఉంచారు.