నెల్లూరు: అనుమానాస్పదస్థితిలో ఒకరు మృతి చెందిన సంఘటన నాయుడుపేట - మేనకూరు సెజ్ ప్రాంతంలో చోటుచేసకుంది. నాయుడుపేట మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన శశికుమార్ తన భార్య, కుమారుడు, తల్లితో కలసి నాయుడుపేటలోని తుమ్మూరులో ఉంటున్నాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన శశికుమార్ రాత్రి వరకు రాకపోవడంతో భార్య నాగమణి ఫోన్ చేయగా వస్తున్నానని చెప్పాడు. తర్వాత అతని ఫోన్ స్విచ్ అయ్యింది.
దీంతో కుటుంబసభ్యులు వెతుకులాట ప్రారంభించారు. గురువారం ఉదయం మేనకూరు సెజ్లోని ఓ ప్రైవేట్ కర్మాగారం వెనుక శశికుమార్ (23) మృతి చెంది ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో ఎస్ఐ కృష్ణారెడ్డి సంఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ముఖంమీద గాయాలు ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు తెలిపారు.