తన భాగస్వామితో ఆస్పత్రికి వెళ్లిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిపై డ్రగ్స్ కేసుతో పాటు 40కి పైగా కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గతేడాది డిసెంబర్ లో నిమ్మి అనే మహిళ తన ఇంట్లో దాచి ఉంచిన 29 కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావెలిక్కర జిల్లా ఆస్పత్రికి దగ్గర్లోని ఓ అద్దె ఇంట్లో నిమ్మి నివాసం ఉంటుంది. పోలీసులు ఆమె ఇంట్లో గంజాయితో పాటు భారీగా మద్యాన్ని గుర్తించారు. ఆ రోజే ఆమెను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సరఫరా కోసం వినియోగిస్తున్న కారును, నిమ్మి స్కూటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు క్రిమినల్ లిజు ఊమెన్ పై కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఈ డ్రగ్స్ సరఫరాలో లిజు కీలకంగా వ్యవహరించాడు. భర్తకు దూరంగా ఉంటున్న నిమ్మి ఇంటికి లీజు తరచూ వచ్చేవాడు. స్థానికులు వారిద్దరు భార్యభర్తలు అని అనుకున్నారు. అయితే లీజు తనతో తీసుకొచ్చిన డ్రగ్స్ ను నిమ్మి ఇంట్లో, స్కూటర్ లో దాచేవాడు. ఖరీదైన కార్లను డ్రగ్స్ స్మగ్లింగ్ కు వాడేవాడు. పోలీసులు నిమ్మి పిల్లలను బంధువులకు అప్పగించారు. ఆమెను అరెస్ట్ చేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.
క్రిమినల్ లీజుపై ఈ కేసుతో పాటు 40కి పైగా కేసులు నమోదు అయినట్టుగా పోలీసులు తెలిపారు. ఓ ఎస్ఐ హత్యాయత్నం కేసులో కూడా లీజు నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే లీజును పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తన భాగస్వామి నిమ్మితో ఐవీఎఫ్ చికిత్స కోసం ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు లీజు ఊమెన్ను అరెస్ట్ చేశారు. కొంత కాలంగా అతడిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించిన పోలీసులు ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.