భర్త మరణించిన వారం రోజులకే భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మిథున(22), సూరజ్ లకు 7 నెలల క్రితం వివాహం జరిగింది. మిథున తిరువల్లం నర్సింగ్ కాలేజీలో చదువుకుంటోంది. ఈ నెల 5న సూరజ్ ఆమెను బైక్ పై కాలేజీలో దింపి ఇంటికి వస్తుండగా ఎదురుగా వచ్చిన కారు అతడి బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సూరజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సరిగ్గా వారం రోజుల తర్వాత ఆదివారం వేకువజామున మిథున తన ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో సమీపంలోని ఓ నీటికుంటలో మిథున శవమై తేలింది. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేక మిథున నీటికుంటలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. భర్త మరణించిన వారం రోజులకే అతని భార్య ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది.