దసరాకు రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని వైసీపీ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం లేకుండా అధికార పార్టీ నేతలే ఎక్కువగా ప్రజల్లో ఉండేలా సీఎం కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు సమాచారం. అయితే, కేబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం ఇస్తారు, ఎవరిని పక్కన పెడతారనే చర్చ మాత్రం పార్టీ నేతల్లో టెన్షన్ టెన్షన్ గా మారింది.
కాగా ఎన్నికల ప్రచారంలో మంగళగిరి నుండి ఎమ్మెల్యే గా ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే)ని ప్రజలు గెలిపించుకుంటే మంత్రివర్గంలోకి తీసుకుంటానని జగన్ హామీ ఇవ్వడం విదితమే. ఎమ్మెల్యే గా విజయం సాధించిన ఆర్కేను మొదటి విడతలో జగన్ కేబినెట్ లోకి తీసుకుంటారని భావించినప్పటికీ ఆశలు నెరవేరలేదు. అయినప్పటికీ ఆర్కే నిత్యం ప్రజలలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తున్నారని, మంత్రి పదవికి ఆర్కే అర్హులేనని ప్రజలు భావిస్తున్నారు. కేబినెట్ విస్తరణలో భాగంగా జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కి మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.