జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. నిఘవర్గాల సమాచారంతో కశ్మీర్ లోయలో విస్తృత తనిఖీలు చేస్తున్న భద్రతాసిబ్బంది ముష్కరులను మట్టుబెడుతున్నారు. శుక్రవారం అనంత్నాగ్ జిల్లాలో ఓ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని హతమార్చిన సిబ్బంది.. శనివారం మరో ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో భద్రతాసిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా.. ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు జరిపి లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. కాగా.. ముష్కరుల కాల్పుల్లో ఓ పోలీసు గాయపడ్డారు. మృతదేహాల వద్ద నుంచి తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబు దుజానాను ఎన్కౌంటర్లో మట్టుబెట్టిన విషయం తెలిసిందే.