ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. ఓ యూట్యూబ్ చానల్ కు రిపోర్టర్ గా పనిచేస్తున్న కేశవను ఆదివారం రాత్రి దారుణంగా హత్యచేశారు. పదేళ్లుగా రిపోర్టర్ గా పనిచేస్తున్న కేశవపై కానిస్టేబుల్ సుబ్బయ్య కక్షగట్టి తన సోదరుడి సాయంతో స్క్రూ డ్రైవర్ తో వీపు వెనుకభాగంలో పొడిచి హత్యచేశాడు. అయితే కేశవ వారం కిందట గుట్కా వ్యాపారితో టూటౌన్ కానిస్టేబుల్ సుబ్బయ్యకు ఉన్న సంబంధాలను బట్టబయలు చేశారు. ఈ విషయం తెలుసుకుని జిల్లా ఎస్పీ సుధీర్కుమార్రెడ్డి కానిస్టేబుల్ సుబ్బయ్యను సస్పెండ్ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని కానిస్టేబుల్ సుబ్బయ్య ఆదివారం రాత్రి మాట్లాడాలని చెప్పి కేశవను ఎన్జీవోస్ కాలనీలోని ఆటోస్టాండ్ వద్దకు పిలిపించి హత్య చేశాడు.
కానిస్టేబుల్ అవినీతి వ్యాపారాన్ని బట్టబయలు చేసిన విలేకరిని హత్యచేయటం పట్ల జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. కేశవ మృతదేహాన్ని డీఎస్పీ చిదానందరెడ్డి, తాలుకా సీఐ మురళిమోహన్రావు పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.