తెల్ల బంగారం ధరలు పైపైకి పాకుతున్నాయి.. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు ఓ రేంజ్లో పెరిగాయి. మార్కెట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో క్వింటా గరిష్టంగా 8వేల 80రూపాయలు పలికింది. డివిజన్లోని ఏరిగేరి గ్రామానికి చెందిన రైతు కిష్టప్ప.. తాను పండించిన పత్తిని ఆదోని వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చారు. ఆ రైతుకు చెందిన పత్తి గరిష్టంగా క్వింటా 8వేల 80రూపాయలకు వ్యాపారి కొనుగోలు చేసినట్లు యార్డు కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రికార్డ్ స్థాయి ధరలు ఖరీఫ్ సాగుకు ముందు పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకూ ధరలు ఊపందుకోవడానికి వ్యాపారుల మధ్య పోటీనే కారణం అని కాటన్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. దేశంలోని ఏ ఇతర మార్కెట్ కమిటీలలో ఈ ధరలు రైతులకు అందడం లేదని, ఆదోని వ్యవసాయ మార్కెట్లోనే రైతులకు మేలు జరిగేలా ధరల నిర్ణయిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా రైతుల వద్ద కొత్త దిగుబడుల నిల్వలు లేకపోవడం పరిశ్రమలకు అవసరమైన పత్తి లేకపోవడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ధరలు పెరగడానికి కారణమైంది. మార్కెట్కు 65 క్వింటా పత్తి రాగా కనిష్ట ధర 6వేల 509రూపాయలు పలికింది. గరిష్టంగా 8వేల 80రూపాయలుగా అమ్ముడైంది.