క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు బంధాల మధ్య తీరని విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా భర్తను భయపెట్టడానికి ఓ భార్య చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఫలితంగా ఓ ఏడు నెలల పసిపాపకు తల్లి ప్రేమ దక్కకుండా పోయింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని నేలంపాడు గ్రామానికి చెందిన శివమ్మకు కొల్లిగుండ్ల మండలం బెలుం శింగవరానికి చెందిన రఘుకు పదేళ్ల క్రిందట వివాహం జరిగింది. వీరికి పెళ్లైన చాలా కాలం తర్వాత సంతానం కలిగింది. ప్రస్తుతం ప్రస్తుతం వీరికి ఓ పాప జన్మించగా ఆ చిన్నారికి ఏడు నెలలు నిండాయి. ఇదిలా ఉంటే భార్య భర్తల మధ్య జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. చిన్నగొడవ కాస్తా హద్దులు మీరడంతో రఘు భార్యను తీవ్రంగా దూషించాడు.
భర్త మాటలకు మనస్తాపం చెందిన శివమ్మ తన భర్తను భయపెట్టాలని ప్లాన్ వేసింది. తన బలానికి ఇచ్చిన ఐరన్ మాత్రలను మింగింది. ఒకే సారి 13 మాత్రలు మింగడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా ఐరన్ మాత్రలు ఓవర్ డోస్ కావడంతో ఆసుపత్రికి చేరుకునే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. భర్తను భయపెట్టేందుకు వేసిన ప్లాన్ వికటించి శివమ్మ ప్రాణాలు కోల్పోగా పసి పాపకు తల్లి ప్రేమ దూరం అయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.