విశాఖపట్నం: రైతుల సంక్షేమానికి రైతు ఉత్పత్తి సంఘాలు ఎంతగానో ఉపయుక్తమవుతాయని కలెక్టర్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. ఏయూ ప్లాటినం జూబ్లీ మందిరంలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల రైతు ఉత్పత్తి సంఘాల ప్రాంతీయ సదస్సు సోమవారం జరిగింది. సదస్సులో పాల్గొన్న కలెక్టర్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. పటిష్టమైన ఒక ఉమ్మడి వేదిక లేకపోవడం వల్ల పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్నారు. సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేక గిట్టుబాటు ధరలు పొందలేకపోతున్నారన్నారు. రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసే సహాయ సహకారాలను రైతులు అందిపుచ్చుకోవాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకుంటూ స్వయం సంవృద్ధి సాధించాలని కోరారు. రాష్ట్ర మహిళా అభివృద్ధి సమాఖ్య ముఖ్య కార్యనిర్వహణాధికారి సి.ఎస్.రెడ్డి, నాబార్డు ఏజీఎం ప్రసాదరావు, ఉద్యానవన పరిశోధన సంస్థ సంచాలకులు జె.దిలీప్బాబు, శాస్త్రవేత్తలు శ్రీకాంత్, ఉమామహేశ్వరరావు పలువురు అధికారులు పాల్గొన్నారు.