ఏపీలో ఈ క్షణంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినా టీడీపీకి 140 స్థానాలు వస్తాయని ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ దీమా వ్యక్తం చేశారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అవినీతికి పాల్పడే ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఒకరిద్దరు చేసిన తప్పులను అందరికీ ఆపాదించలేమని అన్నారు. వైసీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన నాయకులందరికీ సీట్ల సర్దుబాటు చేస్తామని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరగదని ఎవరు చెప్పారు? అని, రాజ్యాంగ సవరణ మాత్రమే చేయాలని చెప్పారని లోకేశ్ అన్నారు. ప్రముఖ హీరోలు పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రస్తావించారు. అమరావతిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ తో తమకు ఎటువంటి విభేదాలు లేవని, పార్టీ కోసం పని చేసేందుకు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు. అదే విధంగా, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం పూర్తి అవుతాయని చెప్పిన లోకేశ్, తమ ఉనికి కోసమే బీజేపీతో కలుస్తామంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. బీజేపీతో తమకు ఎటువంటి విభేదాలు లేవని లోకేశ్ చెప్పుకొచ్చారు.