మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి తన భార్యను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలోని హొళగుందలో సోమవారం జరిగింది. హొళగుంద ఎస్సీ కాలనీకి చెందిన మల్లికార్జున (28)కు కర్ణాటక రాష్ట్రం బళ్లారి పట్టణానికి చెందిన ముత్తమ్మ(24)తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులున్నారు. మద్యానికి బానిసైన మల్లికార్జున తరచూ మద్యానికి డబ్బులు ఇవ్వాలని భార్య ముత్తమ్మతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో మల్లికార్జున తల్లి పిల్లల్ని తీసుకుని వేరే వారి ఇంటికి వెళ్లి అక్కడే నిద్రపోయింది. ఉదయం లేచి ఇంటికి తిరిగి వచ్చి చూడగా.. మల్లికార్జున, ముత్తమ్మ ఉరికి వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. ముత్తమ్మ నుదటిపై గాయముండి నోటిలో రక్తం కారిన దృశ్యాలు ఉన్నాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తన కూతుర్ని అల్లుడే చంపి ఉరేశాడని, తర్వాత భయపడి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారులను చూసి పలువురు కంటతడి పెట్టారు.