ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరకొరియా మరో దుస్సాహసం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 29, 2017, 10:12 AM

ప్యాంగ్‌యాంగ్‌: తమ చర్యలతో అగ్రరాజ్యం అమెరికా సహా పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. ఇతర దేశాల హెచ్చరికలను పెడచెవిన పెట్టి.. తాజాగా మరో ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. శనివారం ఉదయం ఈ క్షిపణిని ప్రయోగించినట్లు కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. హ్వాసంగ్‌-14 పేరుతో ప్రయోగించిన ఈ ఖండాంతర క్షిపని 3,725 కిలోమీటర్ల ఎత్తులో 998 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్‌ జలాల్లో పడింది.


శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దీన్ని ప్రయోగించారు. క్షిపణి ప్రయోగంపై ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ వున్‌ సంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ప్రయోగం విజయవంతమైందని కిమ్‌ అన్నారు. క్షిపణిని అభివృద్ధి చేసిన నిపుణులపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ క్షిపణితో అమెరికా మొత్తం తమ గుప్పిట్లో ఉందని తెలిపారు. అమెరికాలోని ప్రముఖ నగరాలైన లాస్‌ ఏంజిల్స్‌, చికాగో లాంటి వాటిని కూడా ఈ క్షిపణితో నాశనం చేసే సామర్థ్యం తమకుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.


కాగా.. ఉ.కొరియా ఇలాంటి ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం ఈ నెలలో ఇది రెండోసారి. జులై 4న తొలి ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. అది అమెరికాలోని అలస్కాను చేరే సామర్థ్యం గలదని ఆ సమయంలో ఉ.కొరియా పేర్కొంది. తాజాగా మరోసారి అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల క్షిపణిని పరీక్షించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com