ఓ యువకుడి చేసిన పనికి ఓ యువతి జీవితం సందిగ్ధంలో పడింది. పెళ్లి చూపుల్లో పిల్ల నచ్చిందని చెప్పి.. తీరా పెళ్లి దగ్గరపడేసరికి ఆ యువకుడు మాట మార్చాడు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ యువకుడు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతనికి కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతితో పెద్దలు పెళ్లి కుదిర్చారు. పెళ్లి చూపుల్లో ఆ యువకుడు అమ్మాయి నచ్చిందని చెప్పాడు. దీంతో వారికి నిశ్చితార్థం జరిపించారు.
మరో 15 రోజుల్లో పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఆ యువకుడు తనకు అమ్మాయి నచ్చలేదని బాంబు పేల్చాడు. దీంతో యువకుడి కుటుంబ సభ్యులతో పాటు అమ్మాయి తరపువారు షాకయ్యారు. పెద్దలు ఎంత సర్దిచెప్పినా అబ్బాయి ఒప్పుకోలేదు. దీంతో పెళ్లి రద్దయింది. యువతి తరపు బంధువులు అమ్మాయి భవిష్యత్తు ఏం కావాలని నిలదీస్తున్నారు. తమకు జరిగిన నష్టానికి రూ.18లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇరు కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది. మంచి చదువు, మంచి ఉద్యోగం ఉన్న నిలకడలేని నిర్ణయాలతో ఓ యువతి భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేశాడని బంధువులు అతడిపై మండిపడుతున్నారు.