రాత్రంతా లేదా ఎక్కువ సేపు ఛార్జింగ్ చేస్తే మొబైల్ బ్యాటరీ చెడిపోతుంది అంటుంటారు. ఇలా చేయడం వల్ల బ్యాటరీలు పేలే ప్రమాదముందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కీప్యాడ్ ఫోన్లను పొరపాటున కూడా ఇలా వదిలేయొద్దంటున్నారు. పక్కాగా చార్జింగ్ మిషన్ ఆపి వేయాలంటున్నారు. అలా రాత్రంతా చార్జింగ్ పెడితే బ్యాటరీ ఉబ్బిపోయి.. ఎందుకు పనికిరాకుండా పోయే ప్రమాదముందట. అంతేకాదు, బ్యాటరీ చార్జింగ్ కూడా వెంటనే దిగిపోతుందట. అయితే ఈ ఇబ్బంది కొత్త తరం మొబైళ్లలో ఉండదంటున్నారు నిపుణులు. ప్రస్తుతం వస్తోన్న స్మార్ట్ఫోన్లలో బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్ అయిపోయాక ఆ ప్రక్రియ నిలిచిపోయేలా మొబైల్, ఛార్జర్లలో సాంకేతికతను జోడించారట. దాని వల్ల బ్యాటరీ ఛార్జింగ్ వంద శాతానికి చేరుకోగానే ఛార్జింగ్ ప్రక్రియ దానంతట అదే ఆగిపోతుందట. కాబట్టి ఆ సదుపాయం ఉంటే బ్యాటరీ పేలిపోతుందనే ఆందోళన అక్కర్లేదట. కానీ శ్యామ్ సంగ్ వంటి బడా కంపెనీల ఫోన్లే పేలిపోగా లేనిది ఇతర కంపెనీల ఫోన్లు పేలవని గ్యారంటీ లేదని కూడా అంటున్నారు. అందుకే మన జాగ్రత్తలో మనముంటే మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. చార్జింగ్ ఫుల్ అవ్వగానే తీసేయడం మంచిదంటున్నారు.