సింగపూర్ : కొవిడ్ రెండు డోసుల టీకాలు తీసుకున్నాక కూడా భారత యువకుడికి కరోనా సోకడం సింగపూర్ దేశంలో సంచలనం రేపింది. కొవిడ్-19 రెండు డోసుల టీకా తీసుకొని వర్క్ పర్మిట్పై సింగపూర్ దేశానికి వచ్చిన భారత యువకుడు కరోనా బారిన పడ్డారు. సింగపూర్ దేశంలో 20 కరోనా కేసులు వెలుగుచూడగా వారిలో కొవిడ్ టీకాలు వేసుకున్నాక కూడా భారత యువకుడికి కరోనా సోకిందని తేలింది.కరోనా సోకిన యువకుడిని వెంటనే ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. రెండు సార్లు జరిపిన పరీక్షల్లోనూ భారత యువకుడికి కరోనా పాజిటివ్ అని రావడంతో అతన్ని పరీక్షించేందుకు జాతీయ అంటువ్యాధుల నివారణ కేంద్రానికి తరలించారు.
కొవిడ్ టీకాలు వేయించుకున్న వ్యక్తులు కూడా కరోనా బారినపడే అవకాశాలున్నాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ తన నివేదికలో పేర్కొంది. టీకాలు వేయడం ద్వారా కరోనా సంక్రమణ వ్యాప్తి చెందకుండా నిరోధించడంపై మరిన్ని పరిశోధనలు అవసరమని ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.సింగపూర్ లో ఇప్పటివరకు 60.653 కొవిడ్ కేసులు నమోదైనాయి.సింగపూర్ లో కరోనాతో 30మంది మరణించారు.