కోల్కతా: భారతీయ జనతా పార్టీపై మరోసారి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. బీజేపీ ఈ దేశాన్ని విడిచివెళ్లాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం 'బీజేపీ భారత్ విడిచి వెళ్లు' (బీజేపీ భారత్ ఛడో) ఉద్యమాన్ని ఆగస్టు 9న ప్రారంభించనున్నట్టు ఆమె ప్రకటించారు. ఆగస్టు 31వరకూ మూడువారాల పాటు ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు. 1993 కోల్కతా కాల్పుల్లో మరణించిన టీఎంసీ కార్యకర్తల స్మృత్యర్థం శుక్రవారంనాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, 'బీజేపీ క్విట్ ఇండియా' ఉద్యమాన్ని అన్ని లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, బ్లాక్, సిటీ, గ్రామ స్థాయిలో నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బ్లాక్ లీడర్లు అంతా పాల్గొంటారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఏమాత్రం పని చేసుకోనీయడం లేదని మమతా బెనర్జీ ఆ సందర్భంగా ఆరోపించారు. 'మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో, లేదో మనకే తెలియని పరిస్థితులు ఇప్పుడు దేశంలో ఉన్నాయి. బూటకపు హిందూయిజంతో గౌరవప్రదంగా బతుకుతున్నామో లేదో తెలియని పరిస్థితి హిందువుల్లో ఉంది. దళితులు, ముస్లింలు గౌరవప్రదంగా బతుకుతున్నారా అనేది కూడా అగమ్యగోచరంగా మారింది' అంటూ కేంద్రం వ్యవహార శైలిపై ఆమె విరుచుకుపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అది పెద్ద స్కామ్లలో ఒకటని ఆమె ఎద్దేవా చేశారు. 'నోట్ల రద్ద సమయంలో బీజేపీ కోట్లాది రూపాయలు కూడబెట్టుకుంది. నోట్ల రద్దు వల్ల ఎంత సొమ్ము వచ్చిందనే విషయంలో ఇప్పటికీ ఆర్బీఐ వద్ద లెక్కలు లేవు. నోట్ల రద్దుతో జమైన మొత్తం ఎంతో తేల్చడానికి విచారణ జరపాలని మేము కోరుతున్నాం. ఇది చాలా పెద్ద స్కామ్. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశంలో ఉపాధి తగ్గిపోయింది' అని మమత ఆరోపించారు. పశ్చిమబెంగాల్లో వాపపక్షాలు రహస్యంగా బీజేపీకి వత్తాసు పలుకుతున్నాయని అన్నారు. 'టీఎంసీకి అంకితభావం లేకుండే వామపక్షాలను తప్పించి అధికారంలోకి వచ్చేది కాదు. ఇక్కడి నుంచి బీజేపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేస్తాం' అని తెగేసి చెప్పారు. డార్జిలింగ్లో అశాంతి పరిస్థితులకు కేంద్రమే కారణమని ఆరోపించారు. ఢిల్లీ ఆడుతున్న గేమ్ వల్లే అశాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయని, అయితే ఎంతోకాలం ఈ పరిస్థితిని కొనసాగనిచ్చేది లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.