మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. తాజాగా ఈ నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు బీడ్ జిల్లాలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు, కల్యాణ మండపాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు కార్యాలయాలు అన్ని మూసివేయనున్నారు. ప్రైవేటు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని సూచించారు. కిరాణాలు, పాలు, ఇతర అత్యవసరమైన దుకాణాలకు మినహాయింపును ఇచ్చారు.