న్యూఢిల్లీ: టిబెట్ సరిహద్దులో సైన్యాన్ని మోహరిస్తూ ఇండియాను భయపెట్టడానికి చూస్తున్న చైనా తీరుపై కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఆమె ఇవాళ రాజ్యసభలో మాట్లాడారు. తనను తాను రక్షించుకునే సత్తా ఇండియాకు ఉందని, చైనా తీరు తమను కనీసం భయపెట్టడం కూడా లేదని ఆమె స్పష్టంచేశారు. చైనా, ఇండియా సరిహద్దు ఉద్రిక్తతలపై రాజ్యసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు సుష్మా సమాధానమిచ్చారు. కొన్నేళ్లుగా ట్రై జంక్షన్ పాయింట్ దగ్గరికి రావడానికి చైనా ప్రయత్నిస్తూనే ఉన్నది. రోడ్లను రిపెయిర్ చేయడంలాంటి చర్యలు అందులో భాగమే అని ఆమె వెల్లడించారు. అయితే జూన్ 16న జరిగిన ఘటన ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయని సుష్మా చెప్పారు. ఈసారి మాత్రం చైనా బుల్డోజర్లు, నిర్మాణ సామగ్రితో ఆ ప్రదేశానికి వచ్చింది. అది మన దేశ భద్రతకు ముప్పు వాటిల్లే చర్య అని ఆమె వివరించారు. భారత బలగాలు వెనక్కి వెళ్లాలని చైనా చెబుతున్నది. అలాంటపుడు చైనా కూడా అదే చేయాలి. ఈ విషయంలో న్యాయం, హక్కు మనవైపే ఉన్నాయి అని సుష్మా స్పష్టంచేశారు. నిజానికి ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపే ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఇక వన్ బెల్ట్ వన్ రోడ్పై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. చైనా, పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ను ఓబీఓఆర్లో భాగం చేస్తున్నారని తెలియగానే మా నిరసనను గట్టిగానే తెలిపామని చెప్పారు. ఇండియా అనుకూల దేశాలన్నీ ఈ ప్రాజెక్ట్ వెనుక చైనా దురుద్దేశమేంటో పసిగట్టాయని సుష్మా అన్నారు.