రాష్ట్రపతి భవన్లో కొలువుదీరే తదుపరి ప్రథమ పౌరుడు ఎవరనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది. రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5గంటల సమయానికి ఫలితాలు వెల్లడి కానున్నాయి. నాలుగు టేబుళ్లపై మొత్తం ఎనిమిది రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నారు. తొలుత పార్లమెంట్ భవన బ్యాలెట్ పెట్టెను, తర్వాత ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాల బ్యాలెట్ పెట్టెలను తెరిచి లెక్కిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనూప్ మిశ్రా చెప్పారు.
ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగియనుంది. దీంతో తదుపరి ప్రథమ పౌరుడి కోసం జులై 17న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 99శాతం ఓటింగ్ నమోదైంది. అధికార ఎన్డీయే తరఫున బిహార్ మాజీ గవర్నర్ రామ్నాథ్ కోవింద్.. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఈ ఎన్నికల్లో పోటీపడ్డారు. ఎన్డీయే కూటమి పార్టీలతో పాటు జేడీయూ, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా కోవింద్కు మద్దతిచ్చాయి. దీంతో కోవింద్ గెలుపు లాంఛనమే అయినప్పటికీ.. ఎంత మెజార్టీతో గెలుస్తారా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జులై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు.