అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డిపై విధించిన విమానయాన నిషేధాన్ని ఇండిగో, ఎయిర్ ఇండియాలు బుధవారం ఎత్తివేశాయి. విశాఖపట్నం విమానాశ్రయంలో అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణలతో జేసీపై గతనెల 15న ఇండిగో.. అనంతరం కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణ నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండిగో ప్రతినిధులు, జేసీ.. కేంద్రమంత్రి సుజనాచౌదరి ఇంట్లో సమావేశమై పరస్పరం విచారం వ్యక్తం చేసుకున్నారు. వివాదం సమసిపోవడంతో తక్షణం నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఇండిగో ప్రతినిధి విక్రం చోనా ప్రకటించారు.
నిషేధం కారణంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడానికి జేసీ రూ. 6 లక్షలు ఖర్చుపెట్టి ప్రత్యేక విమానంలో దిల్లీకి వచ్చారు. ఓటేసిన అనంతరం సమస్యను కేంద్రమంత్రి అరుణ్జైట్లీ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన పౌర విమానయాన మంత్రి అశోక్గజపతిరాజుతో మాట్లాడి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఆ బాధ్యతలను పక్కనే ఉన్న సుజనాచౌదరికి అప్పగించారు. ఇద్దరూ అశోక్గజపతిరాజు కార్యాలయానికి వెళ్లి సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేస్తూ లేఖ ఇవ్వడానికి దివాకర్రెడ్డి నిరాకరించారు. తనతో ఇండిగో ఉద్యోగి చాలా అనుచితంగా ప్రవర్తించారని తెలిపారు. దీంతో ఇండిగో ఎయిర్పోర్ట్స్ ఆపరేషన్స్ ప్రతినిధి రామ్దాస్, జేసీల మధ్య సమావేశం ఏర్పాటు చేశారు.
జేసీ ఆరోపిస్తున్న వ్యక్తిని దిల్లీకి పిలిపించి మధ్యాహ్నం సుజనాచౌదరి నివాసంలో సమావేశపరిచారు. సుజనాచౌదరి జోక్యంతో జేసీ, ఆ ఉద్యోగి కరచాలనం చేసుకుని వివాదానికి తెరదించారు. వెంటనే నిషేధం ఎత్తివేస్తూ ఇండిగో ప్రకటన చేయగా.. తర్వాత ఎయిర్ ఇండియా కూడా ప్రకటించింది. మిగతా విమానయాన సంస్థలు కూడా నిషేధం ఎత్తివేసే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి. కాగా జేసీ దాఖలు చేసిన కేసును ఆయన ఉపసంహరించుకుంటున్నట్లు ఇండిగో ప్రతినిధి తెలిపారు.