ఆధార్ చెల్లుబాటు తదితర అంశాలపై దాఖలైన వ్యాజ్యాలపై మంగళవారం నుంచి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్. ఖేహర్, జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ విచారణ చేపడుతుంది. వ్యక్తిగత ఏకాంత హక్కుకు భంగం కలగడం తదితర అంశాలపై ఈ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అలాగే వివిధ ప్రజా సంక్షేమ పథకాలకు ఆధార్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడాన్ని కొందరు సవాల్ చేశారు. వీటికి సంబంధించి అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్, సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్లు ఇటీవల న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. వారిద్దరూ ప్రధాన న్యాయమూర్తి ఎదుట చేసిన విజ్ఞప్తి మేరకు ఆధార్ సంబంధిత వ్యవహారాలను విచారించేందుకు విస్తృత రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు ఈనెల 12న సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈమేరకు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం ఆధార్ సంబంధిత అంశాలన్నింటిపై విచారణ జరుపుతుంది.