ఉప రాష్ట్రపతి ఎన్నికలో తమ తరఫున నిలబెట్టాల్సిన అభ్యర్థి కోసం ఎన్డీఏ పార్లమెంటరీ బోర్డు సమావేశం అయింది. తన నివాసం నుంచి బయలుదేరిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ భేటీలో పాల్గొనేందుకు ఇప్పటికే కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అక్కడకు చేరుకున్నారు. ప్రధాని మోదీ కాసేపట్లో రానున్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రేపు సాయంత్రం ఐదు గంటలలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో మరికాసేపట్లో ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించనుంది. ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి రేసులో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, బీజేపీ సీనియర్ నేత ఒ.రాజగోపాల్ పేర్లు వినపడుతున్నాయి. ఉత్తరభారత్ నుంచి రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టిన నేపథ్యంలో దక్షిణ భారత్ నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తోంది. వెంకయ్య నాయుడినే ఎన్డీఏ తమ అభ్యర్థిగా నిలబెడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.