బెంగళూరు : కర్ణాటక జైళ్ల శాఖ నుంచి ఐపీఎస్ డి. రూప మౌద్గిల్ బదిలీ అయ్యారు. జైళ్ల శాఖ డీఐజీ పదవి నుంచి తప్పించిన రూపను.. ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు బదిలీ చేశారు. పరప్పన అగ్రహార జైలులో శశికళకు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నరని డీఐజీ రూప కర్ణాటక రాష్ర్ట పోలీసు ఉన్నతాధికారులకు ఓ నివేదిక అందజేసిన విషయం విదితమే. ఈ నివేదికపై జైళ్ల శాఖ డీజీ సత్యనారాయణ రావు స్పందించిన విషయం తెలిసిందే. శశికళకు వీఐపీ సౌకర్యాలు కల్పించేందుకు తాను లంచం తీసుకోలేదని డీజీ సత్యనారాయణ రావు అన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే శశికళకు సహకరిస్తున్నామని ఆయన తెలిపారు. డీఐజీ రూప రాసిన లేఖలో వాస్తవం లేదని, శశికళకు ప్రత్యేక అవసరాలు ఏమీ కల్పించలేదన్నారు. ఒకవేళ డీఐజీ రూప ఏదైనా గమనిస్తే, ఆమె ఆ విషయాన్ని చర్చించవచ్చు అని, ఒకవేళ తనపై ఆరోపణలు ఉన్నా, తాను విచారణకు సిద్ధమే అన్నారు. ఇటీవలే రూపకు సత్యానారయణరావు మెమో జారీ చేసిన విషయం విదితమే.