చెన్నై: తమిళనాడు రైతులకు అన్నాడీఎంకే గవర్నమెంట్ శుభవార్త వినిపించింది. వ్యవసాయ రుణాలు తీసుకున్న 16 లక్షల మంది రైతులకు తమిళనాడు ప్రభుత్వం సుమారు 12 వేల కోట్లు మాఫీ చేయనున్నది. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న సుమారు 12,110 కోట్ల రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు సీఎం పళనిస్వామి తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతు ఆయన ఈవిషయాన్ని చెప్పారు. రైతులు మళ్లీ వ్యవసారం చేయాలంటే ఈ చర్య చాలా కీలకమైందని సీఎం అన్నారు. కరోనా వేళ రైతులకు పంట నష్టం జరిగిందన్నారు. వరుసగా రెండు తుఫాన్లు, అకాల వర్షాలు భారీ పంట నష్టం జరిగిందన్నారు. తక్షణమే రుణమాఫీ స్కీమ్ను అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.