న్యూఢిల్లీ: జీఎస్టీ అంటే ఇప్పటివరకు అందరికీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనే తెలుసు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఇవాళ దానికి ఓ కొత్త అర్థాన్నిచ్చారు. జీఎస్టీ అంటే గ్రోయింగ్ స్ట్రాంగర్ టుగెదర్ అని మోదీ అన్నారు. ఇవాళ రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా పార్లమెంట్లో ఓటు వేయడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని పార్టీలు కలిసి పనిచేస్తే ఎలాంటి మంచి సాధ్యమవుతుందో చెప్పడానికి జీఎస్టీయే నిదర్శనమని మోదీ అన్నారు. ఇవాళ్టి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. జీఎస్టీ స్ఫూర్తితో అన్ని పార్టీలు కలిసి ఈ సమావేశాలను కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. వర్షాలు భూమికి కొత్త అందాన్ని ఎలా తెస్తాయో.. వర్షాకాల సమావేశాలు కూడా అలాంటి ఫలితాలు తీసుకురావాలని ఆశించారు. ఆగస్ట్ 11 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.