కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సామాన్యులకు తీపి కబురు చెప్పారు. దారిద్య్రరేఖకు దిగువన ఉండే వారు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. ఒకేదేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి పైలెట్ ప్రాజెక్టులు సైతం పూర్తి చేసిన సంగతి తెలిసిందే. పైలెట్ ప్రాజెక్టుల్లో మెరుగైన ఫలితాలు రావడంతో ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తింపజేస్తున్నట్లు తెలిపారు.
ఇకపోతే లబ్ధిదారుల సౌకర్యం కోసమే దేశంలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్ను అమల్లోకి తెచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ పథకంవల్ల లబ్ధిదారుడు ఏ రాష్ట్రం, ఏ ప్రాంతానికి చెందిన వాడైనా మరే ఇతర ప్రాంతం లేదా రాష్ట్రం నుంచైనా సరుకులు తీసుకునే సౌకర్యం కలిగిందని ఆమె తెలిపారు. ముఖ్యంగా బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వలస కార్మికులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని 32 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్ అందుబాటులో ఉన్నదని ఆమె వెల్లడించారు. 69 కోట్ల మంది లబ్ధిదారులు లేదా 86% మంది ఒకే దేశం - ఒకే రేషన్ పరిధిలో ఉన్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.