న్యూఢిల్లీ: గోరక్షణ పేరుతో చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టంచేశారు. అలాగే గోరక్షణకు రాజకీయ, మత రంగులు పులమొద్దని కూడా హెచ్చరించారు. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఆవును తల్లిగా పూజిస్తారని ఈ సందర్భంగా మోదీ అన్నారు. అంతమాత్రాన వాటిని సంరక్షించే పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మాత్రం సహించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు మోదీ సూచించారు. గోరక్షణ పేరుతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా ముస్లింలు, దళితులపై దాడులు జరగడంపై బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశాయి ప్రతిపక్షాలు. వర్షాకాల సమావేశాల్లోనూ ఈ అంశాన్ని లేవనెత్తడానికి సిద్ధమయ్యాయి. రాష్ట్రపతి ఎన్నికపై కూడా మోదీ మాట్లాడారు. ఇద్దరు అభ్యర్థులు ఎంతో హుందాగా ప్రచారాలు నిర్వహించారని మోదీ అన్నారు. అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు వృథా కాకుండా చూసుకోవాలని అన్ని పార్టీలను కోరారు. సోమవారమే రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఎన్డీయే ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ను, ప్రతిపక్షాలు మీరాకుమార్ను రంగంలోకి దింపాయి. ఇక అఖిలపక్ష సమావేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత లాలూపై కూడా మోదీ విమర్శలు గుప్పించారు. మరోవైపు ఆగస్ట్ 9తో క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అన్ని పార్టీలు సంబరాలు జరుపుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. జీఎస్టీకి మద్దతునిచ్చిన అన్ని పార్టీలకు ఈ సందర్భంగా ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.