కొంతమంది తమ కులం పేరును చెబుతూ గొప్పలు పోతూ ఉంటారు. ఇంకా కొందరైతే కార్లు, బైకులు, ఇతర వాహనాలపై తమ కులం పేరును తెలిపేలా స్టిక్కర్లు వేసుకుంటారు. యూపీలో వాహనాలపై ఇలాంటి స్టిక్కర్లు ఎక్కువగా కనబడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే యూపీ రవాణా శాఖ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. వెహికల్స్ పై ‘కులం’ తెలిపే స్టిక్కర్లు వేస్తే.. సదరు వాహనాలను సీజ్ చేస్తోంది.
యూపీలో బైక్ లు, కార్లు, ఎస్యూవీలపై ‘యాదవ్, జాట్, గుజ్జర్, బ్రాహ్మణ్, పండిట్, క్షత్రియ, లోధి, మౌర్య’ వంటి సామాజిక వర్గాల స్టిక్కర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా పెరిగిపోతుండటాన్ని హర్షల్ ప్రభు అనే ఓ టీచర్ గమనించాడు. ఇలా తమ సామాజిక వర్గాన్ని బహిరంగంగా ప్రదర్శించడం సరికాదని, ఇది సమాజంలో విభజనను తీసుకొస్తుందని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కు లేఖ రాశాడు. దీంతో స్పందించిన పీఎం కార్యాలయం యూపీ రవాణా శాఖకు పలు నిబంధనలు రూపొందించి పంపించింది. ఇలాంటి వెహికల్స్ ట్రాక్ చేయడం కోసం ఓ డ్రైవ్ నిర్వహించాలని సూచించింది.
కాగా పీఎంఓ సూచనల మేరకు యూపీ రవాణాశాఖ ప్రస్తుతం ఓ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. స్టిక్కర్ల ద్వారా కులాన్ని ప్రదర్శించే వాహనాలను సీజ్ చేస్తోంది. తమ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ తనిఖీలో ప్రతి 20 వాహనాల్లో ఒకదానిపై స్టిక్కర్ ఉంటోందని, వాహనాలపై కులం తెలిపే స్టిక్కర్లు అంటించొద్దని కాన్పూర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ డీకే త్రిపాఠి తెలిపారు.