తెలుగునాట ప్రతిభకు కొదవ లేదు. అన్ని రంగాల్లోనూ తెలుగువారు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా మైక్రో ఆర్టిస్టులుగా పలువురు రాణిస్తున్నారు. కర్నూల్ జిల్లా మంత్రాయానికి చెందిన నళిని మనసాని తన టాలెంట్తో పలువురి మన్ననలను అందుకుంటూ రికార్డులకెక్కుతున్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆమె చేతిలో రూపుదిద్దుకున్న సుద్దముక్కలతో తయారు చేసిన ఎద్దుల బండి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2సెం.మీ. ఎత్తు, 4 సెం.మీ. పొడవు ఉన్న ఈ బండిపై సంచులను కూడా ప్రదర్శించారు. ఆరుగాలం శ్రమించే రైతులకు మద్దతుగా తానీ ప్రయత్నం చేశానని ఆమె అన్నారు. సుమారు ఆరు గంటల సమయం పట్టిందని ఆమె అన్నారు.
గతంలో నళిని... టూత్ స్టిక్పై 1 నుంచి 9 అంకెల వరకు చెక్కారు. అలాగే సుద్దముక్కపై ఆంజనేయుని గదను కూడా చెక్కి ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, సుప్రీం వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. తన తల్లిదండ్రులు మురారి వీణ, రాఘువేంద్ర శెట్టిల ప్రోత్సాహంతోనే ఈ ఘనతలు సాధించగలుగుతున్నానని ఆమె అన్నారు.