భారత్ లో నిషేధించిన కొన్ని యాప్ లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాప్ల వినియోగానికి సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. పబ్జీ, టిక్టాక్, యూసీ బ్రౌజర్ వంటి నిషేధిత యాప్లను వినియోగించే వారిపై వ్యక్తిగతంగా ఎలాంటి జరిమానాలు కానీ, చర్యలు కానీ తీసుకోమని స్పష్టం చేసింది. నిషేధిత యాప్లను వినియోగించే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారంటూ సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించగా.. కేంద్రం ఈ సమాధానం చెప్పింది.
అయితే, పాటించ సెక్షన్ 69 ఏ ప్రకారం గుర్తించబడిన మధ్యవర్తుల(సంస్థలు)పై మాత్రమే ప్రభుత్వ నిషేధ ఆంక్షలను పాటించనందుకు గానూ జరిమానా విధించడం జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. చైనాకు సంబంధించిన చాలా యాప్లపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, కేంద్రం పలు యాప్లపై నిషేధం విధించినప్పటికీ కొందరు ఆ నిషేధిత యాప్లను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిషేధిత యాప్ల వినియోగంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ కొందరు ఆర్టీఐ ద్వారా కేంద్రాన్ని ప్రశ్నించారు.