కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ సలామ్ (45), భార్య నూర్జహాన్ (38), కుమారుడు దాదా ఖలందర్ (10), కూతురు సల్మా (14) ఈ నెల 3వ తేదీన పాణ్యం వద్ద గూడ్స్ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాధితుడు తీసుకున్న సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించింది. ఈ కేసులో నంద్యాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
దీంతో వారిని సస్పెండ్ చేసి.. పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం ఉదయం నంద్యాల చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తన దృష్టికి రాగానే సీఎం జగన్ తక్షణమే స్పందించారు. దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై హోంమంత్రి, డీజీపీలను నివేదిక కోరారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీ శంకబ్రతబాగ్చీ, గుంటూరు అడిషనల్ ఎస్పీ హఫీజ్ను విచారణాధికారులుగా నియమిస్తూ డీజీపీ సవాంగ్ ఉత్తర్వులిచ్చారు.
ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులు నంద్యాల చేరుకుని విచారణ చేపట్టారు. సస్పెండైన సీఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ లపై పలు ఐపీసీ సెక్షన్లు కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 323 (ఉద్దేశపూర్వకంగా వేధించడం, బాధించడం), 324 (మారణాయుధాలు చూపించడం, బెదిరించడం), 306 (ఆత్మహత్యకు పురిగొల్పడం) తదితర సెక్షన్లపై కేసులు నమోదయ్యాయి. నిందితులను 24 గంటల్లో కోర్టులో హాజరు పరుస్తామని ఏఎస్పీ గౌతమిసాలి, డీఎస్పీ పోతురాజు ఆదివారం రాత్రి విలేకరులకు తెలిపారు. విచారణ పేరుతో భయపెట్టడం, బెదిరింపులకు పాల్పడటం, ఆడవారి పట్ల అమర్యాదగా మాట్లాడటం, ఆత్మహత్యకు ప్రేరేపించడం లాంటివి ఎవరు చేసినా.. అది తప్పేనన్నారు.
అబ్దుల్ సలాం సెల్ఫోన్ ను సీజ్ చేశామని, ఆధారాలను కోర్టులో అందజేస్తామని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం బంధువులను ఏఎస్పీ గౌతమిసాలి నంద్యాల వన్ టౌన్ పోలీస్టేషన్లో విచారించారు. నూర్జహాన్ తల్లి మాబున్నీసా నుంచి వివరాలు సేకరించారు. మరో 10 మంది పోలీసు సిబ్బందిని కూడా విచారించామని, ఈనెల 2వతేదీన సలాం ఆటోలో నగదు పోగొట్టుకున్న భాస్కర్ రెడ్డిని కూడా ప్రశ్నించినట్లు డీఐజీ వెంకటరామిరెడ్డి తెలిపారు. బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, ముఖ్యమంత్రి ఆదేశాలతో విచారణ చేపట్టిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం చర్యలు తీసుకున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. తప్పుచేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.